క్షతగాత్రులకు ప్రభుత్వ ఖర్చులతో వైద్యం
రాష్ట్ర హోం శాఖ విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత
అనకాపల్లి (కోటవురట్ల) ఏప్రిల్ 13: కోటవురట్ల మండలం కైలాసపట్నం గ్రామంలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాద సంఘటనలో మరణించిన మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం 15 లక్షల రూపాయల ఎక్సిగ్రేషియా ప్రకటించడం జరిగిందని, క్షతగాత్రులను మెరుగైన వైద్య నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి కి మరియు విశాఖపట్నం కె. జి. హెచ్. తరలించడం జరిగిందని వారి పూర్తి వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ప్రమాద సంఘటన ప్రదేశాన్ని హోం మంత్రి వంగలపూడి అనిత, పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ ఎమ్. జాహ్నవి, సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ తుహిన్ సిన్హా సందర్శించారు.
సంఘటన జరిగిన సమాచారం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ప్రమాద స్థలానికి చేరుకొని పేలుడుకు కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కోటవురట్ల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వెంటనే విశాఖపట్నం కెజిహెచ్, నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి కి తరలించుటకు ఏర్పాట్లు చేసి, సహాయక చర్యలను పర్యవేక్షించారు. క్షతగాత్రుల బంధువులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.
హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సంఘటన ప్రదేశాన్ని సందర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈ సంఘటన చాలా దురదృష్టకరమని, దుర్ఘటనలో 8 మంది చనిపోయారని, 8 మంది గాయపడ్డారని తెలిపారు. మరణించిన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. దురదృష్టకర సంఘటన పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని, సహాయక చర్యలపై ఆరా తీశారని, మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం మృతుల కుటుంబాలకు 15 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగిందన్నారు. అదేవిధంగా ఈ సంఘటనలో గాయపడిన వారిలో ఆరుగురిని మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం విశాఖపట్నం కెజిహెచ్ కు, ఇద్దరిని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగిందని, వారికి కావలసిన పూర్తి వైద్య సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ప్రాథమిక సమాచారo ప్రకారం బాణసంచా తయారీ కేంద్రానికి అనుమతులు ఉన్నాయని, 2026 వరకు లైసెన్స్ పొందినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో కర్మాగారంలో 16 మంది పని చేస్తున్నారని, వారిలో 8 మంది చనిపోయారని, 8 మంది గాయపడ్డారన్నారు. ప్రాథమిక సమాచార ప్రకారం మందుగుండు తయారీ సమయంలోనే ఒత్తిడి గురై పేలుడు సంభవించినట్లు తెలియజేశారని, ప్రమాద సంఘటనపై పూర్తి విచారణకు ఆదేశించామని క్లూస్ టీం, ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారని, విచారణ అనంతరం పేలుడు జరుగుటకు గల కారణాలు తెలుస్తాయన్నారు.
నర్సీపట్నం ఆర్డిఓ వివి రమణ, కోటవురట్ల తహసిల్దార్ తిరుమల బాబు, జిల్లా అగ్నిమాపక అధికారి కె.వి రమణ సంఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.

మృతి చెందిన వారి వివరాలు:
- దాడి రామలక్ష్మి (35),
W/oవెంకటస్వామి,
R/o రాజుపేట . - పురం పాప (40),
W/o అప్పారావు,
R/o కైలాసపట్నం. - గుంపిన వేణుబాబు (34),
S/o దేముళ్ళు,
R/o కైలాసపట్నం. - సంగరాతి గోవిందు (40),
S/o సత్యనారాయణ,
R/o కైలాసపట్నం. - సేనాపతి బాబూరావు (55)
S/o గెడ్డప్ప ,
R/o చౌడువాడ. - అప్పికొండ పల్లయ్య (50)
S/o నూకరాజు ,
R/o కైలాసపట్నం. - దేవర నిర్మల (38)
W/o వీర వెంకట సత్యనారాయణ,
R/o వేట్లపాలెం. - హేమంత్ (20)
R/o భీమిలి.








