అనకాపల్లి(మార్టూరు), ఏప్రిల్ 28: జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఈ రోజు అనకాపల్లి మండలం మార్టూరు గ్రామ పంచాయతీ పరిధిలోని క్వారీ, స్టోన్ క్రషర్ యూనిట్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయనతో పాటు అనకాపల్లి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.అశోక్ కుమార్, ఎస్సై జి.రవికుమార్ హాజరయ్యారు. క్వారీ, స్టోన్ క్రషర్ యూనిట్లలో భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని, ప్రతి క్వారీ మరియు క్రషర్ యూనిట్ వద్ద హెచ్చరిక బోర్డులు (సేఫ్టీ బోర్డులు) ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఎస్పీ ఆదేశించారు. ప్రతీ క్వారీ, స్టోన్ క్రషర్ యూనిట్ ఎవరిదో అందరికీ తెలిసేలా సరిహద్దులు వివరాలతో కూడిన బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
మైన్స్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు తో జాయింట్ గా ఇన్స్పెక్షన్ చేసి నియమ నిబంధనలు పాటించని వారి మీద, భద్రత ప్రమాణాలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రజలకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిబంధనలు ఉల్లంఘించిన యూనిట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధితో పాటు ప్రజల ప్రాణాలకు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం అనివార్యమని ఎస్పీ చెప్పారు.









