పార్టీ కంటే ఏ ఒక్క నాయకుడూ గొప్ప కాదు.. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు హెచ్చరిక..!

తెలంగాణ బీజేపీలో అసమ్మతి స్వరాలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తీవ్రంగా స్పందించారు. పార్టీలో క్రమశిక్షణకు కట్టుబడి ఉండాల్సిందేనని, నిబంధనలు పాటించకుంటే ఎంతటి నాయకుడిపై అయినా చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని ఆయన గట్టిగా హెచ్చరించారు. పార్టీ నుంచి ఎవరు వెళ్లిపోయినా నష్టపోయేది ఏమీ లేదని ఆయన తేల్చిచెప్పారు.

 

శుక్రవారం ఆయన మాట్లాడుతూ, “బీజేపీలో సిద్ధాంతం, క్రమశిక్షణ ముఖ్యం. పార్టీ కంటే ఏ ఒక్క నాయకుడూ గొప్ప కాదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి” అని స్పష్టం చేశారు. పార్టీ నియమాలను ఉల్లంఘించినందుకు ఒకప్పుడు భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడైన బల్ రాజ్ మదోక్‌ను సైతం సస్పెండ్ చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. పార్టీ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన పునరుద్ఘాటించారు.

 

ఇటీవల గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో రామచంద్ర రావు వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

 

కాంగ్రెస్ పార్టీపై విమర్శలు

 

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సభపై కూడా ఆయన తన సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ ద్వారా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సభ కేవలం సామాజిక న్యాయాన్ని దెబ్బతీయడానికేనని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ దోపిడీకి తెలంగాణ ఒక అక్షయపాత్రగా మారిపోయిందని రామచందర్ రావు వ్యాఖ్యానించారు.

 

ఎన్నికల సమయంలో గ్యారెంటీలు, హామీల పేరుతో ఆర్భాటం చేసిన కాంగ్రెస్, వాటిని అమలు చేయడంలో మాత్రం విఫలమైందని దుయ్యబట్టారు. బీసీ వర్గాలకు తీవ్ర అన్యాయం చేయడమే కాకుండా, ఎస్సీ, ఎస్టీలకు సంకెళ్లు వేసి ఇప్పుడు భీమ్ పేరుతో నాటకాలాడుతోందని ఆయన మండిపడ్డారు.

 

గతంలో ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందని రామచందర్ రావు అన్నారు. ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ వంటి నినాదాలకు తూట్లు పొడిచి, న్యాయాన్ని, రాజ్యాంగ విలువలను కాంగ్రెస్ పార్టీ కాలరాస్తోందని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు