కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలుగు తేజం..!

ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో విపక్షాల ఇండియా కూటమి తమ అభ్యర్థిని ఖరారు చేసింది. ఎవరూ ఊహించని విధంగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలంగాణకు చెందిన జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి పేరును  అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం కావాలన్న అధికార పక్షం ప్రయత్నాలకు ప్రతిపక్షాలు గండికొట్టినట్టయింది.

 

జస్టిస్ సుదర్శన్ రెడ్డి న్యాయవ్యవస్థలో విశేషమైన అనుభవం ఉంది. ఆయన 2007 నుంచి 2011 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందించారు. ఆ తర్వాత గోవా లోకాయుక్తగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన స్వస్థలం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం గ్రామం. న్యాయ వ్యవస్థలో ఉన్నత స్థాయిలో పనిచేసిన తెలుగు వ్యక్తిని ప్రతిపక్షాలు తమ అభ్యర్థిగా ఎంపిక చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

 

ఇప్పటికే అధికార ఎన్డీయే కూటమి తమ అభ్యర్థిగా దక్షిణాదికి చెందిన సీపీ రాధాకృష్ణన్ పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి బదులుగా ఇండియా కూటమి సైతం దక్షిణాది నుంచే బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో అనూహ్యంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును తెరపైకి తెచ్చింది. దీంతో ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల పోరు ఇద్దరు దక్షిణాది నేతల మధ్య ఆసక్తికరంగా మారింది. ఈ ఎంపిక ద్వారా ప్రతిపక్షాలు కేవలం పోటీ ఇవ్వడమే కాకుండా, న్యాయవ్యవస్థకు చెందిన ప్రముఖుడిని బరిలోకి దించి వ్యూహాత్మకంగా వ్యవహరించాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు