ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనడం లేదు.. ఎందుకో చెప్పిన కేటీఆర్..

ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయించుకున్నట్లు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రైతుల పక్షాన తమ గళాన్ని వినిపించేందుకే ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు.

 

సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రెండూ రైతాంగాన్ని వేధిస్తున్నాయని ఆరోపించారు. యూరియా సమస్యపై తాము 20 రోజుల ముందే హెచ్చరించినా, రెండు ప్రభుత్వాల నుంచి ఎలాంటి స్పందన రాలేదని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల తరఫున నిరసన తెలిపేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని వివరించారు.

 

“మేము ఎన్డీఏకు గానీ, ఇండియా కూటమికి గానీ జవాబుదారీ కాదు. కేవలం తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారీ” అని ఆయన అన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల బహిష్కరణను ఒక వేదికగా ఉపయోగించుకుని, తెలంగాణ రైతుల బాధలను దేశం దృష్టికి తీసుకెళుతున్నామని ఆయన పేర్కొన్నారు. తమ పోరాటం కేవలం రైతుల సంక్షేమం కోసమేనని కేటీఆర్ తేల్చిచెప్పారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు