హింసాత్మకంగా నేపాల్… ఇండియా-నేపాల్ బోర్డర్ లో హైఅలర్ట్ ప్రకటించిన కేంద్రం..

పొరుగు దేశమైన నేపాల్‌లో రాజకీయ సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. అవినీతికి వ్యతిరేకంగా యువత ఆధ్వర్యంలో జరుగుతున్న దేశవ్యాప్త నిరసనలతో నేపాల్ అట్టుడుకుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇండియా-నేపాల్ సరిహద్దు వెంబడి భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు, నేపాల్‌లో నివసిస్తున్న భారత పౌరులకు కీలక సూచనలు జారీ చేసింది.

 

నేపాల్‌లో అవినీతికి వ్యతిరేకంగా, గతంలో విధించిన సోషల్ మీడియా నిషేధానికి నిరసనగా యువత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. ఈ నిరసనలు హింసాత్మకంగా మారడంతో, అక్కడి ప్రభుత్వం రాజధాని ఖాట్మండు సహా పలు ప్రధాన నగరాల్లో కర్ఫ్యూ విధించింది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో ఉన్న పానీటంకి ఇండియా-నేపాల్ సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద భద్రతను గణనీయంగా పెంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించేందుకు గస్తీని ముమ్మరం చేశామని, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని జిల్లా ఎస్పీ ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు. “సరిహద్దు ప్రాంతంలో ప్రత్యేక పోలీస్ పోస్ట్ ఏర్పాటు చేసి బలగాలను మోహరించాం. భద్రతా ఏజెన్సీలు, నేపాల్ పోలీసుల సహకారంతో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం” అని ఆయన వివరించారు.

 

మరోవైపు, నేపాల్‌లోని పరిణామాలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. నేపాల్‌లో చోటుచేసుకుంటున్న సంఘటనలను నిశితంగా గమనిస్తున్నామని, నిరసనల్లో పలువురు యువకులు ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. “నేపాల్‌లోని భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలి. స్థానిక అధికారులు జారీ చేసే మార్గదర్శకాలను, సూచనలను తప్పనిసరిగా పాటించాలి” అని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

 

సన్నిహిత పొరుగు దేశంగా, నేపాల్‌లో అన్ని వర్గాలు సంయమనం పాటిస్తూ, శాంతియుత చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఆశిస్తున్నట్లు భారత్ తన ప్రకటనలో పేర్కొంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు