జూబ్లీహిల్స్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు..? లిస్ట్‌లో ఆ నలుగురు..!

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. అభ్యర్థి ఎంపికపై రాష్ట్ర నాయకత్వం తన కసరత్తును పూర్తి చేసి, నలుగురు ఆశావహుల పేర్లతో కూడిన జాబితాను సిద్ధం చేసింది. ఈ జాబితాను పార్టీ అధిష్ఠానానికి పంపనుండటంతో, ఇప్పుడు అందరి దృష్టీ ఢిల్లీ పెద్దల నిర్ణయంపైనే నిలిచింది.

 

పార్టీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఖరారు చేసిన తుది జాబితాలో నవీన్ యాదవ్, సీఎన్ రెడ్డి, బొంతు రామ్మోహన్, అంజన్‌కుమార్ యాదవ్ ఉన్నారు. ఈ నలుగురిలో ఒకరిని ఏఐసీసీ ఎంపిక చేసి అధికారికంగా ప్రకటించనుంది. స్థానికంగా బలమైన, గెలుపు గుర్రం అని భావించిన వారికే టికెట్ దక్కే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది.

 

ఇదే సమయంలో, రాష్ట్రానికి చెందిన కీలక నేతలు ఢిల్లీకి పయనం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ రోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టులో వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాదులతో చర్చించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది.

 

అయితే, జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక కీలక దశలో ఉన్నప్పుడు నేతలు ఢిల్లీ వెళుతుండటంతో, అధిష్ఠానంతో ఈ అంశంపై కూడా చర్చించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలోనే ఉపఎన్నిక షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండటంతో, వీలైనంత త్వరగా అభ్యర్థిని ప్రకటించి ప్రచారంలోకి దూసుకెళ్లాలని కాంగ్రెస్ యోచిస్తోంది. దీంతో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ ఎవరిని వరిస్తుందనేది సర్వత్రా ఆసక్తి రేపుతోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు