స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో కీలక మలుపు… తెరపైకి పూర్ణచందర్ భార్య..

తెలుగు న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు ఊహించని మలుపు తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్ భార్య స్వప్న తాజాగా తెరపైకి వచ్చి సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త అమాయకుడని, అసలు బాధితురాలు తనేనంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఈ కేసుకు కొత్త కోణాన్ని తెరపైకి తెచ్చాయి.

 

వివరాల్లోకి వెళితే, స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న పూర్ణచందర్‌ను వెనకేసుకొస్తూ ఆయన భార్య స్వప్న మాట్లాడారు. తన భర్త ద్వారానే స్వేచ్ఛ తనకు పరిచయమైందని, అయితే వారిద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి తనకు మొదట తెలియదని ఆమె వివరించారు. వారి వ్యవహారం తెలిసిన తర్వాత తాను పూర్ణచందర్‌ను వదిలేశానని స్పష్టం చేశారు.

 

అంతేకాకుండా, స్వేచ్ఛ తనను మానసికంగా తీవ్రంగా వేధించిందని స్వప్న ఆరోపించారు. పూర్ణచందర్‌ను స్వేచ్ఛ బ్లాక్‌మెయిల్ చేసిందని, తన పిల్లలను కూడా “అమ్మా” అని పిలవాలంటూ భయపెట్టిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్వేచ్ఛ కూతురు అరణ్య తన భర్తపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని స్వప్న కొట్టిపారేశారు. పూర్ణచందర్.. అరణ్యను సొంత కూతురిలాగే చూసుకున్నాడని ఆమె తెలిపారు.

 

“నా భర్త చాలా అమాయకుడు, ఆయన నిర్దోషి. స్వేచ్ఛే ఆయన్ను, నన్ను మానసికంగా హింసించింది,” అని స్వప్న చెప్పుకొచ్చారు. నిందితుడి భార్యే స్వయంగా రంగంలోకి దిగి, మృతురాలిపైనే ఆరోపణలు చేయడంతో ఈ కేసు దర్యాప్తులో ఈ వ్యాఖ్యలు కీలకంగా మారే అవకాశం ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు