హైదరాబాదులో నీటి ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి..

భాగ్యనగరంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. దీనికి తోడు వాతావరణ శాఖ మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగి, హైదరాబాద్‌లోని నీటి ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు.

 

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి అమీర్‌పేట్‌లోని గంగుబాయి బస్తీ, బుద్ధ నగర్‌తో పాటు పలు లోతట్టు ప్రాంతాలను సందర్శించారు. భారీ వర్షాల వల్ల రోడ్లపైకి చేరిన మురుగునీటిని, డ్రైనేజీ వ్యవస్థను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వరద నీటితో తాము పడుతున్న కష్టాలను స్థానికులు ముఖ్యమంత్రికి వివరించారు. వారి సమస్యలను సావధానంగా విన్న రేవంత్ రెడ్డి, వీలైనంత త్వరగా శాశ్వత పరిష్కారం చూపుతామని భరోసా ఇచ్చారు.

 

పర్యటన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హైదరాబాద్ కమిషనర్‌ను, సిబ్బందిని ఆదేశించారు. నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో వెంటనే తొలగించేందుకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. అదే సమయంలో, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, ముఖ్యంగా విద్యుత్ స్తంభాలు, తెరిచి ఉన్న మ్యాన్‌హోల్స్‌కు దూరంగా ఉండాలని హెచ్చరించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు