బనకచర్ల ప్రాజెక్టుపై తేల్చాల్సింది కేంద్రమే..! భట్టి కీలక వ్యాఖ్యలు..

గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. మిగులు జలాల్లో తెలుగు రాష్ట్రాల వాటాలు తేలిన తర్వాతే గోదావరిపై ఎలాంటి కొత్త ప్రాజెక్టులు నిర్మించినా అది చట్టబద్ధంగా, న్యాయంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. నీటి వాటాలను నిర్ధారించాల్సిన పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు.

 

‘ఓట్ల చోరీ’ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నంలో వచ్చిన భట్టి విక్రమార్క, మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టుపై అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందించారు. నదీ జలాల కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేశారు. ప్రస్తుతం తమ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయి, నీటి కేటాయింపులు జరిగిన తర్వాతే మిగులు జలాల అంశంపై ఒక స్పష్టత వస్తుందని ఆయన వివరించారు.

 

అయితే, ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టును గట్టిగా సమర్థించారు. పోలవరం నుంచి వృథాగా సముద్రంలోకి పోయే గోదావరి వరద నీటిని బనకచర్లకు తరలించి రాయలసీమను అభివృద్ధి చేయాలనేది తమ లక్ష్యమని చెప్పారు. దిగువ రాష్ట్రంగా వరదల వల్ల తాము నష్టపోతున్నామని, అలాంటి వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం జరగదని భరోసా ఇచ్చారు.

 

‘ఓట్ల చోరీ’ నిరసనలో పాల్గొన్న భట్టి

 

ఇదే పర్యటనలో, భట్టి విక్రమార్క ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘ఓట్ల చోరీ’ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించడం పౌర హక్కులను కాలరాయడమేనని ఆయన అన్నారు. అర్హులైన ఓటర్లను తొలగించి, బోగస్ ఓట్లను చేర్చడం ద్వారా బీజేపీ లబ్ధి పొందిందని ఆరోపించారు. ఈ విషయంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధారాలతో సహా మోదీ ప్రభుత్వాన్ని నిలదీశారని గుర్తుచేశారు. అయినప్పటికీ, ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆయన విమర్శించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు