ఆ ధరలు తగ్గించండి..! జీఎస్టీ కౌన్సిల్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ..

ధరల తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో కేంద్రానికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. జీఎస్టీ స్లాబ్ రద్దు అంటూ కేంద్రం ప్రచారం చేసుకుంటోందని, కానీ ధరల తగ్గింపుపై చిత్తశుద్ధి లేదని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గితే అన్ని వస్తువుల ధరలు తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు.

 

కేంద్ర ప్రభుత్వం చేనేత వస్త్రాలపై 5 శాతం జీఎస్టీ విధించిందని, ఆ తర్వాత ఆ పన్నును 12 శాతానికి పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ విధింపును వ్యతిరేకిస్తూ తాము కేంద్ర ప్రభుత్వానికి అప్పుడే లేఖ రాశామని గుర్తు చేశారు. వ్యవసాయం తర్వాత లక్షలాది కుటుంబాలు చేనేత రంగంపై ఆధారపడ్డాయని అన్నారు.

 

చేనేత అనేది కేవలం వస్త్ర తయారీ రంగం మాత్రమే కాదని, అది మన సాంస్కృతిక వారసత్వమని ఆయన అన్నారు. చేనేతపై పన్ను వేయడమంటే మన సంస్కృతిని అవమానించడమేనని కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ నేతృత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేనేతల సంక్షేమానికి ఎనలేని ప్రాధాన్యత ఇచ్చిందని అన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు