అసెంబ్లీలో కీలక ఘట్టం.. కాళేశ్వరం రిపోర్ట్ పై కీలక చర్చ..

తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పే కీలక ఘట్టానికి కాసేపట్లో అసెంబ్లీ వేదిక కానుంది. రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలతో ముడిపడి ఉన్న ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణంలో జరిగిన అవకతవకలు, నాణ్యతా లోపాలపై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై శాసనసభలో నేడు తీవ్ర చర్చ జరగనుంది. ఇప్పటికే ఈ నివేదిక రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తుండగా, నేటి చర్చ మరింత వేడిని రాజేయడం ఖాయంగా కనిపిస్తోంది.

 

అసెంబ్లీ ముందుకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ నివేదిక

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు లక్ష కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక అవినీతి, నాణ్యతా లోపాలు జరిగాయని గతంలో కాంగ్రెస్ ఆరోపించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుపై సమగ్ర విచారణకు జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలో కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్ సుదీర్ఘ విచారణ అనంతరం ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది. ప్రాజెక్టు నిర్మాణంలో అనేక ఆర్థిక లోపాలను, నిరుపయోగమైన వ్యయాలను నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా ప్రాజెక్టు డిజైన్, వ్యయం అంచనా, నిర్మాణ పద్ధతులు, నిర్వహణ వంటి అంశాలపై తీవ్ర అభ్యంతరాలను కమిషన్ వ్యక్తం చేసింది.

 

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని తేల్చిన కమిషన్..

ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ కమిషన్ నివేదికను ఆయుధంగా చేసుకుని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడేందుకు సిద్ధమైంది. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన భారీ అవినీతి, ప్రజాధనం దుర్వినియోగం, నాణ్యతా లోపాలపై సాక్ష్యాధారాలతో సహా సభలో ప్రదర్శించి, బీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ చర్చలో పాల్గొని బీఆర్ఎస్‌కు ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది.

 

ఈ తప్పులకు కేసీఆరే బాధ్యుడని తేల్చిన పీసీ ఘోష్ కమిషన్..

మరోవైపు, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా తమ వాదనలను వినిపించేందుకు సిద్ధంగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి అని, దేశంలోనే అద్భుతమైన ఇంజనీరింగ్ అద్భుతమని, రాజకీయ దురుద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కమిషన్‌ను వేసి నివేదికను తప్పుబడుతోందని బీఆర్ఎస్ ఎదురుదాడికి దిగే అవకాశం ఉంది. ప్రాజెక్టు పునర్విజన అవశ్యకతను, సాగునీటి అవసరాలను, ప్రాజెక్టు ద్వారా కలిగిన ప్రయోజనాలను వివరించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించే అవకాశం ఉంది.

 

బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలని సిఫార్సు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్..

అయితే అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ అనంతరం, ప్రభుత్వం కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోనుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలకు పాల్పడిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటుందా? లేదా అనేది చర్చ, ప్రభుత్వ ప్రకటన అనంతరం స్పష్టమయ్యే అవకాశం ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు