భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. రెండో ప్రమాద హెచ్చరిక..

భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. ఈ ఉదయం 9 గంటల సమయానికి నీటిమట్టం 48 అడుగులు దాటడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. దీంతో ఏజెన్సీ ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

 

వరద ప్రభావంతో స్నాన ఘట్టాల ప్రాంతంలోని మెట్లు, విద్యుత్ స్తంభాలు నీట మునిగాయి. పవిత్ర స్నానాలు ఆచరించే కల్యాణ కట్ట వరకు వరద నీరు చేరడంతో ఆ ప్రాంతమంతా జలమయమైంది. ఈ నేపథ్యంలో భక్తులు ఎవరూ నదిలోకి స్నానాలకు వెళ్లవద్దని అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

 

గోదావరి ఉద్ధృతి కారణంగా తూరుబాక వద్ద ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరింది. దీంతో దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం వంటి నాలుగు మండలాలకు పూర్తిగా రాకపోకలు స్తంభించిపోయాయి. మరోవైపు, గోదావరి వరద పలు ఏజెన్సీ మండలాలను ముంచెత్తింది. వీఆర్ పురం, కూనవరం, చింతూరు మండలాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయి జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు