70కి పైగా బీసీ కుల సంఘాల నేతలతో కవిత భేటీ..! కారణం అదేనా..?

బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని, ఇందుకోసం ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో 70కి పైగా బీసీ కుల సంఘాల నాయకులతో ఈరోజు ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

 

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, ఎన్నికల ముందు కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. బీసీల రిజర్వేషన్ల అంశాన్ని కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇప్పటివరకు పార్లమెంటులో ఎందుకు ప్రస్తావించలేదో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని ఆమె దుయ్యబట్టారు.

 

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలోగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను చట్టబద్ధంగా కల్పించాలని కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్ని బీసీ సంఘాలను కలుపుకొని, రిజర్వేషన్ల సాధన కోసం ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగుతామని తెలిపారు. 42 శాతం రిజర్వేషన్ల లక్ష్యం నెరవేరే వరకు తమ పోరాటం ఆగదని ఆమె తేల్చిచెప్పారు. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల సాధనకు అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు ప్రధానంగా చర్చించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు