ఉప రాష్ట్రపతి ఎన్నికకు దూరంగా బీఆర్ఎస్..! సంచలన రేపుతున్న బీఆర్ఎస్ నిర్ణయం..!

దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌కు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

 

ఈరోజు ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడిన బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సురేశ్ రెడ్డి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. పార్టీ అధినేత కేసీఆర్‌తో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే, అన్ని కోణాల్లో ఆలోచించి ఓటింగ్‌లో పాల్గొనకూడదని నిర్ణయానికి వచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 

ముఖ్యంగా యూరియా కొరత రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని, ఈ సమస్యను పరిష్కరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పలుమార్లు కోరినా వారు విఫలమయ్యారని సురేశ్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వాల వైఫల్యానికి నిరసన తెలిపేందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నామని, బ్యాలెట్‌పై ‘నోటా’కు అవకాశం లేనందున ఎన్నిక ప్రక్రియకు దూరంగా ఉంటున్నామని వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తోందని కూడా ఆయన ఆరోపించారు.

 

రేపు జరగనున్న ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరఫున సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇద్దరు అభ్యర్థుల పట్ల తమకు అపారమైన గౌరవం ఉందని, వారు తమ రంగాల్లో నిష్ణాతులని సురేశ్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా ఒక అభ్యర్థి తమ రాష్ట్రానికి చెందినవారే అయినప్పటికీ, రైతుల సమస్యలకే తమ పార్టీ మొదటి ప్రాధాన్యం ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు